
D Spiritual: Jul 3: తెలంగాణ తిరుపతిగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (YTD)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి దేవస్థానం తరహాలో ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆధ్యాత్మిక, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ బోర్డును ఏర్పాటు చేయడం విశేషంగా మారింది.
మొత్తం 18 మంది సభ్యులతో కూడిన యాదగిరిగుట్ట దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డుకు ప్రముఖ ఫార్మా సంస్థ MSN గ్రూప్ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డిని తొలి ఛైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాలతో ఆలయ పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
ఈ ట్రస్ట్ బోర్డులో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కూడా చోటు కల్పించారు. ఆమె సభ్యురాలిగా నియమితులవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆలయ ట్రస్ట్ బోర్డులో ఆమెకు అవకాశం కల్పించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
చైర్మన్తో పాటు బోర్డు సభ్యులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, తూళ్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మలయ్య, స్వాతి కాంతమణి, ఎం. రాఘవేంద్రరావు, డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ తదితరులను ప్రభుత్వం నియమించింది.
చైర్మన్తో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకాలకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీవో విడుదల చేశారు. కొత్తగా నియమితులైన సభ్యుల ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవోకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ట్రస్ట్లో 10 మందిని సాధారణ సభ్యులుగా, మరో ఏడుగురిని ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారు. ఎక్స్ అఫీషియో సభ్యులు, వ్యవస్థాపక ట్రస్టీ మినహా మిగతా సభ్యుల పదవీకాలం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
