
DNews: Dec26:గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న చర్య తీసుకుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీని కోసం ఒక ప్రైవేట్ కంపెనీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు కేంద్రంగా ఈ డ్రోన్ మెడిసిన్ డెలివరీ సేవను నిర్వహించడానికి ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ఒప్పందం ప్రకారం, గిరిజన ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా వచ్చే నెల చివరి నుండి అధికారికంగా ప్రారంభమవుతుంది.
ప్రస్తుతం పాడేరును కేంద్రంగా చేసుకుని సేవలు ప్రారంభించినప్పటికీ, భవిష్యత్తులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్) నుండి పాడేరుకు ఈ డ్రోన్ సేవను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోందని అధికారులు తెలిపారు. డ్రోన్ల ద్వారా మందుల సరఫరాతో.. మారుమూల ప్రాంతాల్లోని గిరిజన ఆసుపత్రులను త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. కొండ ప్రాంతాలు మరియు రహదారి సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా.. మందులను సకాలంలో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం గిరిజన ఆరోగ్య వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుందని, అలాగే సేవల వేగం మరియు నాణ్యతను పెంచుతుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రజలకు సకాలంలో వైద్య సహాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
