
D Spiritual: Feb 19: మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం పండగ వాతావరణం నెలకొంటుంది. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు తమ ఇళ్లలో కూడా ఈ వేడుకలను ఉత్సవంలా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి, ఆలయ ఈఓ డి. బాపి రెడ్డి గత సంవత్సరాలకన్నా భిన్నంగా ఉత్సవాలను నిర్వహించాలని ప్రణాళికలు రచించి విజయవంతంగా అమలు చేశారు. బుధవారం వేకువజామున గౌరీ శంకరుల కళ్యాణోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. వేలాది మంది భక్తులు, విఐపిలు పాల్గొని దేవదేవుని కళ్యాణాన్ని కన్నుల విందుగా వీక్షించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ సంప్రదాయంలో వివాహానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రతిబింబించే విధంగా వేడుకలు సాగాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి కళ్యాణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సందర్భంగా నిరుపేదలు, మొక్కులు పెట్టుకున్న వారు, ప్రేమజంటలు లేదా రెండో వివాహం చేసుకోవాలనుకునే వారు స్వామి అమ్మవార్ల మాంగల్యధారణ వేళ వివాహాలు చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం కూడా అదే సంప్రదాయం పాటించారు.
గతంలో దొంగపెళ్లిళ్లు, బాల్యవివాహాలపై ఆరోపణలు రావడంతో భక్తుల సంఖ్య కొంత తగ్గిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి నిబంధనల ప్రకారం మాత్రమే వివాహాలు నిర్వహించారు. వివాహం చేసుకున్న వారు రెవెన్యూ శాఖ అధికారుల వద్ద నుంచి ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలి రావడంతో పట్టణమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
ఆలయంలోని అలంకార మండపంలో స్వామివారిని కైలాసనాథుడిగా, అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ దేవిగా వధూవరులుగా అద్భుతంగా అలంకరించారు. పట్టణంలోని తేరువీధి వాహన మండపం వద్ద స్వామివారిని అంబారి వాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ప్రతిష్టించారు. మంగళవారం అర్థరాత్రి తరువాత గ్రామోత్సవం ప్రారంభమైంది. మొదటి పూజలను ఆలయ ఈఓ డి. బాపి రెడ్డి దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ దంపతులు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ దంపతులు నిర్వహించారు.
మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాలు, గెరిగెనృత్యాలు, పంచవాయిద్యాలు, బుట్టబొమ్మల నాట్యాలు, మయూరాల ఆటలు, కీలుగుర్రాలు, లంబాడ నృత్యాలతో గ్రామోత్సవం వైభవంగా సాగింది. వేద మంత్రాల నడుమ అంబారి వాహనంపై ఆశీనుడైన శ్రీకాళహస్తీశ్వరుడు, సింహవాహనంపై ఆశీనురాలైన జ్ఞానప్రసూనాంబ దేవి అలంకార శోభతో కళ్యాణ వేదికకు చేరుకోవడం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. నాటి రాజులు అందించిన ఏడు వారాల నగలతో అలంకరించబడిన స్వామి అమ్మవార్ల దర్శనం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
