
D Spiritual: Feb 19: ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా జరగనుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో ఆలయ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. కోదండరామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడిసరుకుల నిల్వ షెడ్లను పరిశీలించి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ కోసం టేబుళ్లు, కుర్చీలు సమృద్ధిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆలయం మరియు యాగశాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే శ్రీవారి సేవకుల సేవలను స్థానిక ఆలయాల్లో వినియోగిస్తున్న విధంగానే ఒంటిమిట్టలో కూడా వినియోగించుకోవాలని సూచించారు.
ఆలయ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల వేదికను పరిశీలించిన అనంతరం కళ్యాణ వేదిక వద్ద మౌలిక సదుపాయాలను సమీక్షించారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాటు చేసిన 17 కౌంటర్లు, ప్రవేశ మరియు నిష్క్రమణ ద్వారాలను పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జలప్రసాదాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వేదిక చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు రహదారి ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. విఐపిల బస కోసం అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని తెలిపారు. తాత్కాలిక వంటశాల ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, తాగునీటి సదుపాయం వంటి ఇంజినీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రథం తిరిగే ముఖ్య వీధులు, ముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. భక్తులను ఆకట్టుకునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు ముందు పది రోజులపాటు ప్రచార రథాల ద్వారా పరిసర గ్రామాల్లో ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
