
DSports 10 Dec: టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో టీమ్ ఇండియా ఘనంగా శుభారంభం చేసింది. కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 101 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది… గాయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (4), అభిషేక్ శర్మ (17) తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన భారత జట్టును హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు.గాయం నుంచి తిరిగొచ్చిన హార్దిక్.. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు (నాటౌట్) చేసి జట్టు స్కోరును 175/6కి చేర్చాడు.అతనికి తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) చక్కటి సహకారం అందించారు.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభం నుంచే సఫారీ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. హార్దిక్ పాండ్యా సహా బౌలర్లందరూ అద్భుతంగా రాణించారు.హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కూడా కీలకమైన ఒక వికెట్ (డేవిడ్ మిల్లర్) తీసి తన ఆల్రౌండర్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.భారత బౌలర్ల పదునైన దాటికి దక్షిణాఫ్రికా కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సఫారీ జట్టులో డివాల్డ్ బ్రెవిస్ (22) మాత్రమే కాసేపు పోరాడాడు.
అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
