
D Spiritual: Oct 12: సాధారణంగా ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు కావాలని, జీవితంలో అన్నీ అనుకున్నట్లు కలిసి రావాలని ఆశపడుతుంటారు. అలా జరగడం కోసం చాలామంది తమ సొంత శక్తితో పాటు దైవబలంను కూడా నమ్ముతారు. దైవబలం అనేది అదృష్టానికి బలమైన ఆధారంగా భావించబడుతుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో దైవ పూజ చేస్తే అదృష్టం మరింతగా కలిసివస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమావాస్య రోజున పూజలు చేస్తే అదృష్టం వెంట ఉంటుందని నమ్మకం ఉంది. అందుకే ధనప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, అదృష్టం కోరుకునేవారు ఆదివారం అమావాస్య రోజు లక్ష్మీదేవిని పువ్వులతో పూజ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
అమావాస్యనాడు పూజకు ముందు ఇంటిని పూర్తిగా శుభ్రపరచుకోవడం అత్యంత ముఖ్యం. గడపను కూడా శుభ్రం చేసి, పసుపు, కుంకుమ, పిండితో ముగ్గు వేయాలి. అంతేకాకుండా ఇంటిని పసుపు నీళ్లతో శుభ్రం చేయడం శుభప్రదంగా ఉంటుంది. పూజ కోసం ముందుగానే 108 మల్లెపువ్వులను (Jasmine flowers) సిద్ధం చేసుకోవాలి. ఇవే అమ్మవారి పూజలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
పూజ సమయంలో సిద్ధం చేసుకున్న మల్లెపూల దండను లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి. తర్వాత అమ్మవారి పేర్లను ఒక్కొక్కటిగా జపిస్తూ, ఒక్కొక్క పువ్వును సమర్పించాలి. అమ్మవారికి పాలతో చేసిన పరమాన్నంను నైవేద్యంగా సమర్పించడం అత్యంత శుభకరం. అనంతరం కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. హారతి ఇస్తున్నప్పుడు 21 లవంగాలు వేయడం వలన నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధంగా ప్రతి అమావాస్య రోజున పూజ చేస్తే లక్ష్మీదేవి కృపతో మంచి ఫలితాలు లభిస్తాయి.
అమావాస్య రోజున కొన్ని దానాలు, నియమాలు కూడా పాటించడం అవసరం. ఆ రోజున గోమాతకు ఆహారం తినిపించడం వలన అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా, అన్నదానం చేసే ప్రదేశంలో ఆకుపచ్చ కూరగాయలు కాకుండా అవసరమైన ఆహార పదార్థాలను దానం చేయడం ఎంతో మంగళప్రదం. ఈ విధంగా చేయడం వలన మీపై ఎల్లప్పుడూ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు కుంకుమ బొట్టు, నల్లపూసలు ధరించడం శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కృప సదా మీ కుటుంబంపై ఉంటుంది.
