
DNews:14 NOV:శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) గురువారం భారీ ఏవియేషన్ ఘనతకు వేదికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి బరువైన కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ AN-124 రస్లాన్ రన్వేపై ప్రత్యక్షం కావడంతో విమానాశ్రయం పరిసరాల్లో థ్రిల్ వాతావరణం నెలకొంది. ఈ అరుదైన ల్యాండింగ్ను చూసిన విమానాశ్రయ సిబ్బంది, ఏవియేషన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంపై RGIA ఓ ప్రకటన విడుదల చేసింది. AN-124 ల్యాండింగ్ మరోసారి తమ ప్రత్యేక కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని నిరూపించిందని పేర్కొంది. గ్లోబల్ స్టాండర్డ్స్తో ఓవర్సైజ్డ్ కార్గోను హ్యాండిల్ చేయగల సదుపాయాలు తమ వద్ద ఉన్నాయని, ఈ మహా విమానాన్ని స్వాగతించడం ఎల్లప్పుడూ ప్రత్యేక అనుభూతి అని తెలిపింది.
ఉక్రెయిన్కు చెందిన ఆంటోనోవ్ కంపెనీ రూపొందించిన AN-124 ప్రపంచంలో అత్యంత భారీ కార్గో జెట్లలో ఒకటి. భారీ యంత్రాలు, రక్షణ వ్యవస్థలు, పరిశ్రమలకు సంబంధించిన పెద్దసైజ్ సరుకులను తరలించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ విమానం చివరిసారి అక్టోబర్ 10న హైదరాబాద్కు వచ్చి, ఇప్పుడు కొలంబో బండరనాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి RGIAలో దిగింది.AN-124 ల్యాండింగ్తో RGIA జటిలమైన, భారీ కార్గో ఆపరేషన్లను నిర్వహించగలిగే హబ్గా తన సామర్థ్యాన్ని మరింత బలంగా చాటుకుంది. గ్లోబల్ కార్గో ట్రాఫిక్లో హైదరాబాద్ ప్రాధాన్యం వేగంగా పెరుగుతోందనడానికి ఇది మరో సంకేతం.
విమాన ప్రియులకు 2016లో RGIAలో ల్యాండ్ అయిన ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం ఆంటోనోవ్ AN-225 మారియా ఇప్పటికీ మరపురాని అనుభవం. ఆరు టర్బోఫ్యాన్ ఇంజిన్ల శక్తితో నడిచే AN-225 640 టన్నుల గరిష్ఠ బరువుతో ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నది. అప్పుడు అది టుర్క్మెనిస్తాన్ నుంచి హైదరాబాదుకు చేరింది.ఇప్పుడు AN-124 మళ్లీ RGIAలో దిగడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక కార్గో ఆపరేషన్ల చరిత్రలో మరో గుర్తుండే రోజు నమోదైంది.
