
DNews: Dec 12: హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ మూవీ టికెట్ బుకింగ్ ప్లాట్ఫారమ్ ‘బుక్ మై షో’పై తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా టికెట్ ధరలను పెంచి విక్రయించినందుకు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ‘అఖండ 2’ సినిమా టికెట్ ధరల పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఈ పిటిషన్ వేసి ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. హైకోర్టు విచారణ జరిపి ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. అయినప్పటికీ, బుక్ మై షో పెరిగిన ధరలకే టికెట్లు విక్రయించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు లెక్క చేయనట్టుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. కోర్టు ప్రశ్నించగా, బుక్ మై షో “ఆదేశాలు అందకముందే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారు” అని సమాధానం ఇచ్చింది. దీనిపై హైకోర్టు “ఇప్పటికీ పెరిగిన ధరలకే టికెట్లు విక్రయిస్తున్నారా?” అని ప్రశ్నించింది. కోర్టు ఎందుకు మీపై కాంటెంప్ట్ చర్యలు తీసుకోకూడదని అడిగింది. విచారణను మధ్యాహ్నం 1 గంటకు వాయిదా వేసి తిరిగి ప్రారంభించింది. ఇదిలా ఉండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘అఖండ 2’ సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 12 నుండి 14 వరకు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్లలో రూ.100 అదనంగా పెంచుకోవచ్చని అనుమతించింది. డిసెంబర్ 11న జరిగిన ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. పెరిగిన టికెట్ ధరల ద్వారా వచ్చిన లాభాల్లో 20 శాతం సినిమా కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని స్పష్టంగా పేర్కొంది.
