
D Spiritual: Jan 30: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి కోట ఉంటుంది. అయితే వాతావరణ మార్పులు లేదా సరైన సంరక్షణ లేకపోవడం వల్ల కొన్నిసార్లు తులసి మొక్క ఎండిపోతుంటుంది. అలా ఎండిపోయినప్పుడు చాలామంది నిరుత్సాహపడి ఆ మొక్కను తీసేస్తుంటారు. కానీ ఆ ఎండిన మొక్క నుంచే మళ్లీ సరికొత్త తులసి మొక్కను పెంచుకోవచ్చని మీకు తెలుసా? ఇప్పుడు అదెలాగో చూద్దాం.
ఎండిన తులసి నుంచి కొత్త మొక్కను పెంచే విధానం
ముందుగా కుండలో ఎండిపోయిన తులసి మొక్కను జాగ్రత్తగా తీసివేయాలి. ఆ మొక్కకు ఉన్న ఎండిన మొగ్గలను వేరు చేయాలి. ఈ మొగ్గల్లోనే తులసి విత్తనాలు ఉంటాయి.
తర్వాత పాత కుండలోని మట్టిని బాగా కలిపి, అవసరమైతే కొంచెం కొత్త మట్టిని లేదా సేంద్రియ ఎరువును జోడించాలి. వేరు చేసిన ఎండిన మొగ్గలను మట్టిలో చల్లి, వాటిపై తేలికగా మట్టిని పరచాలి.
విత్తనాలు చల్లిన వెంటనే తగినంత నీరు పోయాలి. మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి కానీ మరీ ఎక్కువగా నీరు పోయకూడదు.
ఆ తరువాత కుండను సూర్యకాంతి పడే ప్రదేశంలో ఉంచాలి. కొద్ది రోజుల్లోనే విత్తనాల నుంచి చిన్న చిన్న మొక్కలు మొలకెత్తడం గమనించవచ్చు.
తులసి మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని చిట్కాలు
తులసి మొక్కకు అవసరానికి మించి నీరు పోయకూడదు. ఇలా చేస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. మొక్కకు మంజరి వచ్చినప్పుడు వాటిని తుంచి వేయడం వల్ల మొక్క ఎక్కువకాలం పచ్చగా ఉంటుంది. అలాగే పక్షులు, చీడపీడలు దరిచేరకుండా మొక్కను సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిది.
