
D Spiritual: Dec 8: ఉదయాన్నే మంచి పనులతో రోజును ప్రారంభిస్తే రోజంతా చక్కగా సాగుతుందని పెద్దలు చెబుతారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందడమే కాక లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం ఉంది. ఎవరి జీవితంలోనైనా ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఉదయం నిద్రలేచిన వెంటనే చేసే పనుల్లో కొద్దిపాటి మార్పులు చేస్తే, ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపాదన మార్గాలు పెరుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి. రోజును ఎలాంటి భావాలతో ప్రారంభిస్తామో, అదే రీతిగా ఆ రోజు పూర్తిగా ప్రభావితం అవుతుందని నమ్మకం. అందుకే నిద్రలేచిన వెంటనే శ్రీకృష్ణుడి ముఖాన్ని చూడటం చాలా శుభప్రదంగా భావించబడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచితే ఆరోగ్యం, ఆనందం, శాంతి లభిస్తాయనీ, ఉదయం యోగా–ధ్యానం చేస్తే మనసు సానుకూలతతో నిండిపోతుందని చెబుతారు.
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆర్థిక ప్రగతికి, మానసిక బలానికి కూడా ఎంతో మంచిదని పెద్దలు సూచిస్తారు. ఈ సమయానికి లేవడం జీవితంలో విజయాలను అందుకునే శక్తిని పెంపొందిస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత కొన్ని ముఖ్యమైన పనులు చేస్తే వాటి ప్రభావంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తుందని విశ్వాసం ఉంది. ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత పూజా గదిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శుభకరం. ఇది దేవుని అనుగ్రహాన్ని అందించడమే కాక కుటుంబ సభ్యులకు శాంతి, సంతోషం, విజయాలను కలిగిస్తుంది.
రాత్రి సమయంలో రాగి పాత్రలో నీరు నింపి అందులో తులసి దళాలను వేసి ఉంచితే, తెల్లవారిన తర్వాత ఆ తులసిజలాన్ని ఇల్లంతా చల్లడం అత్యంత శుభదాయకం. ఇలా చేయడం ద్వారా ధనలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఇంటిలో నిలిచి ఉంటుందని నమ్మకం. అదేవిధంగా ప్రతిరోజూ ఉదయం అభ్యంగ స్నానం చేసి సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించడం కూడా చాలా శ్రేయస్కరం. రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కుంకుమ, మందారం పూలు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే శరీరానికి ఆరోగ్యం, ప్రతీ పనిలో విజయాలు లభిస్తాయని చెబుతారు.
ఉదయం వేళ ధ్యానం చేయడం ఎంతో పవిత్రమైంది. నిద్రలేచిన తరువాత కొంత సమయం దేవుని సాధనకు కేటాయించడం మనస్సుకు శాంతి, సానుకూలత, ఆధ్యాత్మికతను అందిస్తుంది. ఈ సమయంలో సాధించిన విజయాలకు దేవునికి కృతజ్ఞతలు తెలపడం పుణ్యాన్ని పెంచుతుందని చెప్తారు. హిందూ సంప్రదాయంలో ఆవులను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆవు శరీరంలో సకల దేవతలు ఉంటారని నమ్ముతారు కాబట్టి ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత గోవు సేవ లేదా పూజ చేయడం శుభకరం. గోమాతను సేవించే వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక కటాక్షం కురిపిస్తారని శాస్త్రాలు పేర్కొంటాయి.
