
DNational 10 Dec: ఢిల్లీ పోలీసులు భారీ సైబర్ క్రైమ్ ముఠాను ఛేదించారు. బీమా మోసం పేరుతో క్యాన్సర్ రోగిని ₹1.30 లక్షలు మోసగించిన కేసులో ఇద్దరు మహిళలతో సహా నలుగురిని అరెస్టు చేశారు. నిందితులు భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ (IRDAI) అలాగే ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ అధికారులుగా నటిస్తూ, పెండింగ్లో ఉన్న బీమా వాపసు పేరుతో బాధితుడిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కె.పీ. తోమర్ అనే ఫిర్యాదుదారుడు నాలుగు ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నారు. కానీ క్యాన్సర్ నిర్ధారణయ్యాక ప్రీమియంలు చెల్లించలేకపోయారు. నాలుగు పాలసీలలో మూడు పాలసీలకు బీమా వాపసు వచ్చినప్పటికీ, నాల్గవ పాలసీ మాత్రమే పెండింగ్లో ఉండిపోయింది.
జూలైలో తోమర్కు అంబుడ్స్మన్ అధికారులమని చెప్పుకుంటూ ఫోన్ కాల్స్ రావడంతో మోసం బయటపడింది. అతని పెండింగ్ రీఫండ్ ఫైల్ తమ వద్ద ఉందని, అయితే కొంత “ప్రాసెసింగ్ ఫీ” చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. విశ్వసించిన తోమర్ ₹83,000 మరియు ₹47,000లను రెండు వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత “తుది క్లియరెన్స్” కోసం ₹12 లక్షల విలువైన నకిలీ ‘RBI బాండ్’ కొనాలని ఒత్తిడి చేయడంతో తోమర్ తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బ్యాంకు లావాదేవీలను సాంకేతికంగా విశ్లేషించి నిందితుల వరకు చేరుకున్నారు. మొదటగా ప్రధాన నిందితులను అరెస్టు చేశారు:
దేవేందర్ కుమార్ – భజన్పురా నివాసి, ఇన్సూరెన్స్ సేల్స్ కంపెనీ ఉద్యోగి. కస్టమర్ డేటాను దుర్వినియోగం చేసి మోసగాళ్లకు చేరవేసినట్టు ఒప్పుకున్నాడు. డబ్బు మళ్లింపుకు తన భార్య, వదిన ఖాతాలను ఉపయోగించాడు.
అరుణ్ కుమార్ (42) – సీలంపూర్కు చెందినాడు. గతంలో క్రెడిట్ కార్డు, ఇన్సూరెన్స్ సేల్స్ సంస్థల్లో పనిచేసిన ఇతడు, దేవేందర్ అందించిన డేటాతో IRDAI, అంబుడ్స్మన్ అధికారుల్లా నటిస్తూ బాధితులను నమ్మబలికే వాడని పోలీసులు తెలిపారు.
సిమ్రాన్ మరియు మన్ప్రీత్ కౌర్ – దేవేందర్ భార్య, వదిన. వీరి ఖాతాలకే మోసపూరిత డబ్బు మొదట చేరి, తర్వాత ప్రధాన లబ్ధిదారుడి ఖాతాకు మళ్లించినట్టు ఆరోపించారు.
దర్యాప్తులో ఉపయోగించిన నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక డెబిట్ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు DCP (నైరుతి) అమిత్ గోయల్ తెలిపారు. ఈ నిందితులు మరింత పెద్ద సైబర్ మోసం సిండికేట్లో భాగమా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
