
గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని మరి ఇప్పటివరకు కేసులు నమోదు చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన భూములను ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు.
23 లక్షల ఎకరాల భూ మార్పిడి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారని ఆ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ధరణి, ప్రస్తుతం భూ భారతి పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. ‘సెట్’ పేరుతో వ్యవహారాన్ని సెటిల్ చేసుకునే ప్రయత్నం జరుగుతోందా అని ప్రశ్నించారు.
లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఫారెస్ట్ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకరినొకరు కాపాడుకునేందుకు జగన్నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాము లేవనెత్తిన లక్షల కోట్ల రూపాయల అవినీతి అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అన్నారు.
జ్యుడీషియల్ విచారణ జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్ట్ వన్-బీలో ఐదు లక్షల ఎకరాలను క్లియర్ చేశామని ప్రభుత్వం చెబుతోందని ఇందుకోసం ప్రత్యేకంగా ఏమైనా దరఖాస్తులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆ ప్రక్రియను అందరికీ వివరిస్తే మిగిలిన 25 లక్షల ఎకరాలను కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని అందులోని మతలబు ఏమిటో ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
