
DNews: Dec 03: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పిన మాటలను కొంతమంది వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్పష్టం చేస్తూ, వచ్చే పది సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తానే నడిపిస్తానని తెలిపారు. ఉత్తర భారతదేశంలో కూడా తనకు ప్రజాదరణ పెరుగుతోందని, దానిపై తాను సంతోషంగా ఉన్నానని అన్నారు. ఇటీవల నియమితులైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఆయన సూచనలు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ హిందూ దేవుళ్లలాంటిదని, హిందూ సమాజంలాంటిదని గుర్తుచేశారు. హిందూ మతంలో మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారని, వారిలో అనేక సామ్యాలు ఉన్నాయని, అదే విధంగా కాంగ్రెస్లో కూడా విభిన్నతలు ఉన్నప్పటికీ ఒక సమగ్రత ఉందని ఆయన వివరించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిన తర్వాత ఈ అంశాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ నాయకుడిగా ఎలా పని చేయాలో తాను ఇప్పటికే వివరించానని, కానీ కొంతమంది తన మాటలను కత్తిరించి వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తన వ్యాఖ్యలపై తాను ఇచ్చిన స్పష్టతను ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
