
DSports:Sep23:ముంబై: ప్రపంచవ్యాప్తంగా అథ్లెటిక్స్ లో పెను సంచలనం సృష్టించిన ఉసేన్ బోల్ట్, తన రన్నింగ్ షూస్ ను పక్కన పెట్టి ఫుట్ బాల్ బూట్లు ధరించి భారత్ కు రానున్నాడు. అక్టోబర్ 1న ముంబైలో జరగనున్న ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ ఫుట్ బాల్ మ్యాచ్ లో పాల్గొనేందుకు ఆయన భారత్ కు వస్తున్నారు. ఈ ఈవెంట్ ఒక స్పోర్ట్స్ బ్రాండ్ నిర్వహించే రెండు రోజుల ఉత్సవంలో భాగంగా జరుగుతుంది.
బోల్ట్ చిన్నప్పటి నుంచి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. అథ్లెటిక్స్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆయన ప్రొఫెషనల్ ఫుట్ బాల్ కెరీర్\ ను కూడా ప్రయత్నించారు. కొన్ని ట్రయల్ మ్యాచ్ లు ఆడారు మరియు కొన్ని గోల్స్ కూడా సాధించారు. అయితే, ఆయనకు ఫుట్ బాల్ లో ప్రొఫెషనల్ కెరీర్ లభించనప్పటికీ, చారిటీ మ్యాచ్ లు, ఎగ్జిబిషన్స్ ద్వారా ఈ క్రీడపై తనకున్న ప్రేమను చాటుకుంటున్నారు.
ఇది బోల్ట్ భారతదేశానికి రెండవ పర్యటన. 2014లో ఆయన మొదటిసారి ఇండియాకు వచ్చినప్పుడు, బెంగళూరులో ఒక స్పాన్సర్ కార్యక్రమం కోసం యువరాజ్ సింగ్ తో కలిసి ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ఈసారి ఫుట్ బాల్ ద్వారా భారత అభిమానులను పలకరించనున్నారు. ఈ పర్యటన దేశంలో స్పోర్ట్స్ టూరిజం వృద్ధికి, అలాగే యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.
