
DNews: Nov 26: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చట్టపరంగా అమలు చేయలేమని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కోసం మొత్తం కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో ధర్నా చేసినా, బీజేపీ కళ్లను తెరవలేదని ఆయన విమర్శించారు. బీసీ సంఘాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసిందని, ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని తెలిపారు. అయినప్పటికీ బీజేపీ ఇంకా అడ్డుకుంటోందని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపలేదని, ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఆ ప్రయత్నం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవడం కలలుగానే మిగిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం వల్ల పాలనకు అంతరాయం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
