
D Spiritual: Oct 30: సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ పూజారి లేదా పురోహితులు “అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం పావనం” అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని మూడు సార్లు భక్తుల చేతిలో వేస్తారు. దేవాలయాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ పూజ తరువాత తీర్థప్రసాదం, హారతి తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది తీర్థం తీసుకున్న తర్వాత ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు — అదేమిటంటే, తీర్థం తీసుకున్న వెంటనే ఆ చేయిని తలపై రాసుకోవడం. కొందరు చేతులు కడిగేసుకోవడం కూడా చేస్తారు.
తీర్థం తీసుకున్నాక చేయి తలకు రాసుకోవడమే శాస్త్రపరంగా సరికాదు అంటున్నారు పండితులు. ఎందుకంటే సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అంటే అందులో పంచదార, తేనె వంటి పదార్థాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ తలకు రాసుకోవడం ఆరోగ్య పరంగా మంచిది కాదు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా తలకు రాసుకోవడం అనుచితం.
తీర్థం తీసుకున్నప్పుడు చేయి ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలి చేతిని కడుక్కోవాలి కానీ తలకు రాసుకోరాదు. తీర్థం తీసుకున్న తర్వాత స్వామి వారి శఠకోపం తలపై పెడతారు. ఎంగిలి చేయి తలపై రాసుకుంటే, స్వామివారి పాదాలుగా భావించే ఆ శఠకోపం అపవిత్రం అవుతుంది.
తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్లకు అడ్డుకోవడం ఎంతో మంచిది అని చెబుతారు. ఇది భక్తి భావాన్ని పెంపొందిస్తుంది.
తీర్థం మూడు సార్లు ఎందుకు తీసుకోవాలో అనే ప్రశ్నకు వస్తే —
మొదటి సారి తీర్థం తీసుకోవడం వల్ల మానసిక, శారీరక శుద్ధి జరుగుతుంది.
రెండవ సారి తీర్థం తీసుకోవడం వల్ల న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కబడతాయి.
మూడవ సారి తీర్థం తీసుకోవడం ద్వారా దేవదేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసినట్టవుతుంది.
