
DNews: Jan30:పాడేరు- అరకులోయ, న్యూస్ టుడే: ‘తూర్పు తీరప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రాబోయే రోజుల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నిర్వహించే పర్యాటక ఉత్సవాలను ఆసియాలోనే అతిపెద్ద ఉత్సవంగా మారుస్తాం’ అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ‘అరకు ఉత్సవ్-2026’ను ఆయన ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్లో భాగంగా అరకు, అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా లంబసింగిలో రూ.6.5 కోట్లతో టెంట్ సిటీ, రూ.5 కోట్లతో క్యారవాన్ పార్కులు, రూ.1.23 కోట్లతో హోమ్స్టేలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ‘గతంలో పర్యాటకం విలాసవంతమైన హోటళ్లు, రెస్టారెంట్లకే పరిమితమైంది. సంకీర్ణ ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించింది. ఆంధ్ర ఆతిథ్యం ఇప్పుడు ప్రపంచ పర్యాటకులకు కొత్త చిరునామాగా మారుతోంది’ అని ఆయన అన్నారు.
