
DNews: Apr17: అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భూకంపాలు సంభవించాయి. ముఖ్యంగా రాంబిల్లి మండల కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, అర్ధరాత్రి సుమారు 12.30 గంటలకు భూమి అకస్మాత్తుగా కంపించింది. ఈ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఈ ఆకస్మిక ప్రకంపనలకు ఉలిక్కిపడి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.రాంబిల్లి మండలం సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో, ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇళ్లలోని సామాన్లు కిందపడటం, కిటికీలు కంపించడంతో ప్రజలు భయంతో వీధుల్లోనే గడిపారు. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. తక్కువ తీవ్రతతో ఉన్నప్పటికీ, మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. తీరప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
