
DNews: Apr15: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక చర్య తీసుకుంది. ఇప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారిక ఉత్తర్వులు, ఫైళ్లు, నోట్ షీట్లలో రాజధాని పేరును ‘అమరావతి’ అని మాత్రమే పేర్కొనాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లకు, శాఖాధిపతులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
ఇప్పటివరకు ఆంగ్లంలో అమరావతి పేరును రాసేటప్పుడు వేర్వేరు స్పెల్లింగ్లు వాడుకలో ఉండేవి. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ఒక ప్రామాణిక స్పెల్లింగ్ను ఖరారు చేసింది. ఇకపై ‘Amaravathi ‘కి బదులుగా కేవలం ‘Amaravati’ అని మాత్రమే రాయాలి. గతంలో కొన్ని సందర్భాల్లో రాజధాని పేరు ప్రస్తావనలో అస్పష్టత ఉండేది. ఇప్పుడు అన్ని ప్రభుత్వ నోట్లు అమరావతి పేరుతోనే ఉండాలని ఆదేశించడం ద్వారా, పరిపాలన అంతా రాజధాని కేంద్రంగానే సాగుతుందనే బలమైన సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, సచివాలయ విభాగాలలో ఈ కొత్త మార్పులను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.
