
D Spiritual: Feb 6: శ్రీశైలం: శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి 3 లక్షల 25 వేల టన్నుల నకిలీ నెయ్యి సరఫరా జరిగిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడించారు. గురువారం శ్రీశైలానికి చేరుకున్న ఆయన దేవస్థానం కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆది కారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ కీలక విషయాలను వెల్లడించారు.
మే 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు దాదాపు 11 నెలల పాటు నకిలీ నెయ్యి సరఫరా జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ కాలవ్యవధిలో సుమారు రూ.11 కోట్ల విలువైన నకిలీ నెయ్యి సరఫరా అయినట్లు తెలిపారు. తిరుమలలో గతంలో వివాదాస్పదమైన బోలే బాబా డైరీ నుంచే, రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారా శ్రీశైల దేవస్థానానికి కూడా ఈ నకిలీ నెయ్యి చేరిందని తెలిసి చాలా బాధ కలిగిందన్నారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, జరిగిన అవినీతి చర్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని వ్యాఖ్యానించారు. ఒక మతంపై దాడులు, రథాలను తగలబెట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. అంతేకాక స్వామివారి ప్రసాదాలకు ఉపయోగించే పదార్థాల్లో కూడా ఇటువంటి అక్రమాలు జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే కాకుండా, ఇక్కడ శివయ్య సన్నిధిలో కూడా ఇలాంటి పాపాలు చేయడం క్షమించరానిదని పేర్కొన్నారు. దేవాలయాల్లో ఈ రకమైన అక్రమాలకు పాల్పడటం భయం లేకుండా జరిగిందని, అందుకే గత ఎన్నికల్లో సంబంధిత వారికి స్వామివారి ఆగ్రహం ఎదురైందని వ్యాఖ్యానించారు.
శ్రీశైల దేవస్థానంలో జరిగిన నకిలీ నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశంలోని అన్ని మతాలను గౌరవిస్తూ, ఎవరి మనోభావాలకు భంగం కలగకుండా పరిపాలన సాగిస్తుందని కూడా ఆయన వెల్లడించారు.
