
D Educt: Aug 24: డీఎస్సీ ద్వారా మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ: లోకేశ్
డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విజయనగరంలోని దాసన్నపేట పాఠశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్లస్టర్ పాఠశాలల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇకపై ప్రతి నెలా ఒక నియోజకవర్గంలోని క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొంటానని లోకేశ్ తెలిపారు. సమాజంలో మనం కోరుకునే మార్పును విద్య ద్వారానే సాధించగలమని తాను బలంగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బోధనలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకోవడంతో పాటు వారి సూచనలు, అభిప్రాయాలను మంత్రి స్వీకరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,034 సముదాయాలకు చెందిన ఉపాధ్యాయులు ఈ సమావేశంలో లైవ్ ద్వారా పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, బోధనలో ఉత్తమ విధానాలను అమలు చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్పై పరిశీలన
ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం బోధనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు.
విజయనగరంలో ఏపీ ఉపాధ్యాయ, రాష్ట్రోపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చేసిన వినతులపై స్పందించిన మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
