
DSports Dec13:న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్ లేమిపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా (Aakash Chopra) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కెప్టెన్గా ఉన్నంత మాత్రాన సరిపోదని, జట్టు కోసం పరుగులు కూడా చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్లో 12 పరుగులు, రెండో మ్యాచ్లో కేవలం 5 పరుగులకే సూర్య పెవిలియన్ చేరడంతో ఆయన ఫామ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా, సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
“కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం లేదా బౌలర్లను మార్చడం మాత్రమే కాదు. అవి కెప్టెన్సీలో ఒక భాగం. ప్రధాన కర్తవ్యం ఏంటంటే.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అత్యధిక పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాలి.”
“గత 20 టీ20 ఇన్నింగ్స్ల్లో సూర్యకుమార్ యాదవ్ సగటు కేవలం 14 మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ 20 ఇన్నింగ్స్ల్లో అతడు చేసింది కేవలం 227 పరుగులు. ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం.”
“ఐపీఎల్ (IPL)లో సూర్య అద్భుతంగా రాణించాడు, 700 పైగా పరుగులు చేశాడు. కానీ, జాతీయ జట్టు తరపున ఆడినప్పుడు మాత్రం ఐపీఎల్కు ముందు, తర్వాత కూడా పరుగులు చేయడం లేదు.”
“నేను సూర్యకుమార్ కెప్టెన్సీకి వ్యతిరేకం కాదు. వచ్చే టీ20 ప్రపంచకప్కు అతడే కెప్టెన్గా ఉంటాడనే విషయంలోనూ సందేహం లేదు. కానీ, నేను స్పష్టంగా చెప్పేది ఒక్కటే.. అతడు తప్పకుండా పరుగులు చేయాల్సిందే.”
“నంబర్ 3 లేదా 4లో బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ కాలం పరుగులు చేయలేకపోతే, అది జట్టుపై ఒత్తిడిని పెంచుతుంది. రాబోయే 2026 టీ20 ప్రపంచకప్ దృష్ట్యా కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరూ త్వరగా ఫామ్ అందుకోవడం అత్యంత అవసరం.”
సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించి, ఇది జట్టుకు మంచి సంకేతం కాదని గతంలో వ్యాఖ్యానించారు.
