
D Spiritual: Oct 14: నివారణలు: కోపం, మొండితనం తగ్గించుకోవడానికి పరిహారాలు
చాలా మంది పిల్లలు, పెద్దలు కోపం ఎక్కువగా చూపుతారు. దాని వల్ల ఇంట్లో, పనిలో, సంబంధాలలో సమస్యలు వస్తాయి. అలాగే మొండితనం కూడా చాలా మందిలో ఉంటుంది — ఎదుటి వారు ఏం చెప్పినా వినకపోవడం, తమదే సరికని పట్టుబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ కోపం, మొండితనం వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని తగ్గించుకోవడానికి పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని శక్తిమంతమైన పరిహారాలు ఉన్నాయి.
1. కొబ్బరికాయ పరిహారం
ఆదివారం ఉదయం కొబ్బరి కాయ తీసుకుని దేవాలయానికి వెళ్లాలి. అక్కడ నవగ్రహాల దగ్గరికి వెళ్లి వారికి నమస్కారం చేయాలి. ఆ తర్వాత కొబ్బరి కాయను చేతిలో పట్టుకుని నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగాలి. తిరిగి ఒకే దెబ్బకు కొబ్బరికాయ పగలగొట్టాలి. దీని తర్వాత చేతులు కాళ్లు కడుక్కుని శివాలయంలోకి వెళ్లి శివుడిని దర్శించుకోవాలి. ఈ పరిహారాన్ని 12 ఆదివారాలు చేస్తే కోపం, మొండితనం క్రమక్రమంగా తగ్గుతాయి.
2. రావి చెట్టు పరిహారం
మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో రావి చెట్టు దగ్గరికి వెళ్లాలి. చెట్టు కింద నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత రావి చెట్టు కింద నాగదేవతల విగ్రహాల దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. నాగదేవతల కింద ఉమ్మెత్తు లేదా చామంతి పూలు అర్పించాలి. ఈ విధంగా 9 మంగళవారాలు లేదా 9 శుక్రవారాలు చేస్తే కోపం, మొండితనం తగ్గుతాయి.
3. దద్దోజనం దానం
మంగళవారం, శుక్రవారం రోజుల్లో దేవాలయ ప్రాంగణంలో భక్తులకు దద్దోజనం పంచిపెట్టాలి. ఇలా 9 మంగళవారాలు, 9 శుక్రవారాలు దానం చేస్తే మనలో ఉన్న కోపం, మొండితనం తగ్గిపోతాయి.
4. దిష్టి తీయడం
నెలకు ఒకసారి అమావాస్య రోజు లేదా మంగళవారం లేదా ఆదివారం రోజున ఎండు మిరపకాయలు, ఉప్పు కలిపి దిష్టి తీయాలి. ముందుగా క్లాక్ వైజ్ మూడు సార్లు, ఆ తర్వాత యాంటి క్లాక్ వైజ్ మూడు సార్లు తీయాలి.
5. సుబ్రహ్మణ్య స్వామి పూజ
సుబ్రహ్మణ్య స్వామి ఫోటోను హాల్లో పెట్టుకోవాలి. ఆయనకు ప్రతిరోజూ నమస్కారం చేయాలి. కుజుడు (మంగళగ్రహం) కోపం, మొండితనానికి కారణమైన గ్రహం. కుజుడి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కావడంతో ఆయనకు భక్తి చూపించడం వల్ల ఈ లక్షణాలు తగ్గుతాయి.
6. దేవాలయంలో సేవా కార్యక్రమాలు
దేవాలయ ప్రాంగణంలో భక్తులకు నీళ్లు, ప్రసాదం పంచిపెట్టడం వంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఇలా సేవ చేస్తూ ఉండడం ద్వారా మనలోని కోపం, మొండితనం క్రమక్రమంగా తగ్గిపోతాయి.
