
ఆసియా క్రీడలకు ముందు టీమ్ ఇండియా, జపాన్ మధ్య ప్రత్యేక టీ20 మ్యాచ్ జరగనుంది. జపాన్లోని శానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 22న ఈ ఏకైక టీ20 మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే వేడుకలకు గుర్తుగా ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోరుకు సంబంధించి జపాన్లో ప్రస్తుతం బ్రాడ్కాస్టింగ్, లాజిస్టిక్స్ సమస్యలు తలెత్తినట్లు సమాచారం.
భారత్-జపాన్ మ్యాచ్ ప్రసార హక్కుల కోసం జపాన్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ఐటీడబ్ల్యూ యూనివర్స్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆసియా క్రీడలు ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు మ్యాచ్ జరగనుండటంతో ప్రసార ఏర్పాట్లు చేయడం నిర్వాహకులకు సవాలుగా మారినట్లు సమాచారం. ఇప్పటివరకు టెలివిజన్ ప్రసారంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
టీవీ ప్రసారానికి ఏర్పాట్లు పూర్తికాకపోతే యూట్యూబ్లో మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లైవ్ స్ట్రీమింగ్ జపాన్లో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్లో మాత్రం ఫ్యాన్కోడ్తో కలిసి మ్యాచ్ను ప్రసారం చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఐటీడబ్ల్యూ సంస్థ స్టార్, సోనీ, జీ వంటి ప్రముఖ ప్రసార సంస్థలతో కూడా చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.
ఇక మరో సమస్య కూడా బ్రాడ్కాస్టర్లకు ఎదురవుతోంది. అదే రోజు ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్ జరగనుంది. ఈ పోరులో భారత మహిళల జట్టు స్వర్ణ పతకానికి ప్రధాన పోటీదారుగా ఉంది. ఆ మ్యాచ్ ముగిసిన సుమారు రెండు గంటల్లోనే భారత్-జపాన్ టీ20 ప్రారంభం కానుంది. దీంతో ఒకే రోజున రెండు కీలక క్రికెట్ మ్యాచ్లను ప్రసారం చేయాల్సి రావడం జపాన్ ప్రసార సంస్థలకు అదనపు సవాలుగా మారింది.
క్రికెట్ను మరిన్ని దేశాలకు విస్తరించాలనే లక్ష్యంలో భాగంగానే భారత్-జపాన్ మ్యాచ్ను నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. సంప్రదాయ క్రికెట్ దేశాల పరిధిని దాటి ఆటను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ఇలాంటి మ్యాచ్లు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
సెప్టెంబర్ 22న జరిగే ఈ మ్యాచ్ ద్వారా జపాన్లో క్రికెట్కు మరింత ఆదరణ పెరుగుతుందని, కొత్త అభిమానులు ఈ క్రీడ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని సైకియా అభిప్రాయపడ్డారు. అయితే మ్యాచ్కు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రసార ఏర్పాట్లు ఎలా పూర్తవుతాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
