
D Educt: Aug 13: రాజేంద్రనగర్లోని పి.వి. నరసింహరావు తెలంగాణ వశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాలలో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్య శస్త్రచికిత్స, రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ (ICAR-SCSP) ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
చివరి సంవత్సరం బీవీఎస్సీ, ఏహెచ్ షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులు, క్షేత్రస్థాయి పశువైద్యులకు కంపానియన్ జంతువుల ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలో జ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు జీవనోపాధి, ఔత్సాహికతను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐదు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ప్రొ. ఉదయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రొ. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో పశువైద్య విద్యార్థులు కేవలం పాఠ్యాంశ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా శస్త్రచికిత్సలోనూ ప్రాయోగిక నైపుణ్యాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. కంపానియన్ జంతువుల వైద్యంలో పెరుగుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు స్వయం ఉపాధి దిశగా కూడా ముందుకు సాగాలని అన్నారు. ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు భవిష్యత్తులో ఉత్తమ పశువైద్య నిపుణులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ ప్రొ. డి. మాధురి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రాయోగిక శిక్షణ అందించడం విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా ఇలాంటి శిక్షణలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
శిక్షణ కార్యక్రమ ప్రధాన పరిశోధకులు, సమన్వయకర్త ప్రొ. జె. రాధాకృష్ణారావు మాట్లాడుతూ.. కంపానియన్ జంతువుల్లో ఆర్థోపెడిక్ సమస్యలను గుర్తించడం, నిర్ధారించడం, ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులను నేర్చుకోవడం వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు, క్లినికల్ నైపుణ్యాలు, ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ముఖ్య అతిథి ప్రొ. ఉదయ్ కుమార్, కార్యక్రమ అధ్యక్షులు ప్రొ. డి. మాధురితో పాటు డా. రవళి, డా. లత, డా. సీహెచ్. సత్యనారాయణ, డా. ప్రవళిక, డా. దినేష్, డా. అరవింద్ తదితరులకు ప్రొ. జె. రాధాకృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది, పరిశోధకులు, చివరి సంవత్సరం బీవీఎస్సీ, ఏహెచ్ విద్యార్థులు పాల్గొన్నారు.
