
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదర్షికోట్ ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన మహీంద్రా XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు
స్థానికుల వివరాల ప్రకారం.. మహీంద్రా XUV కారు రాంగ్ రూట్లో అతివేగంగా దూసుకొచ్చి తొలుత ఓ ఆర్మీ జవాన్ను ఢీకొట్టింది. అనంతరం ఆగకుండా ముందుకు వెళ్లి మరికొందరిని ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ఆర్మీ జవాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
కారులో ఐదుగురు యువకులు
ప్రమాదానికి కారణమైన కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. వారు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగంతో పాటు రాంగ్ రూట్లో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి కారణమైన మహీంద్రా XUV శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతానికి చెందిన బాబు గౌడ్కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కారు డ్రైవర్తో పాటు వాహనంలో ఉన్న యువకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
మృతుడి భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
