
D Spiritual: Jul 27: అమర్నాథ్ యాత్ర: జమ్మూకశ్మీర్లో అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర భక్తిశ్రద్ధలతో సాగుతోంది. ప్రారంభమైన తక్కువ కాలంలోనే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మంచులింగాన్ని దర్శించుకుంటున్నారు.
4 లక్షల మైలురాయిని దాటిన అమర్నాథ్ యాత్ర – ప్రత్యేకతలు
జులై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర కేవలం 24 రోజుల్లోనే సరికొత్త రికార్డును సృష్టించింది. జులై 26 నాటికి ఏకంగా 4.14 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ అమర్నాథ్ జీ ష్రైన్ బోర్డు ఛైర్మన్ మనోజ్ సిన్హా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పరమశివుని ఆశీస్సులతో యాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగుతోందని పేర్కొన్నారు.
తాజాగా జమ్మూ భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి 4,474 మంది భక్తులతో కూడిన కొత్త బృందం బల్తాల్ మార్గానికి పయనం అయింది. అయితే, మార్గంలో నిర్వహణ పనులు జరుగుతుండటంతో సంప్రదాయ పహల్గామ్ (నున్వాన్) రూట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ రోజైన ఆగస్టు 28న ఈ యాత్ర ముగియనుంది.
భద్రతా కారణాల రీత్యా బేస్ క్యాంపుల ప్రాంతాలను ‘నో ఫ్లై జోన్’గా మార్చడంతో హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి. అయినప్పటికీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య భక్తులు బేస్ క్యాంపుల నుంచి ముందుకు సాగుతున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3,880 మీటర్ల ఎత్తున కొలువైన ఈ పవిత్ర గుహను చేరుకోవడానికి భక్తులు బల్తాల్ (14 కి.మీ), పహల్గామ్ (47 కి.మీ) మార్గాలను ఉపయోగిస్తుంటారు. చంద్రుని గమనానికి తగినట్లుగా మంచులింగం తన పరిమాణాన్ని మార్చుకోవడం ఈ యాత్రలోని ప్రత్యేకత.
