
D Entr: Jul 27: రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధనుష్
ప్రముఖ సినీ నటుడు ధనుష్ తన రాజకీయ ప్రవేశంపై మరోసారి ఆసక్తికర సంకేతాలు ఇచ్చారు. అభిమానుల ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రజా సేవ కోసం వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ, “ఇంతమంది ఒకేచోట చేరడం వెనుక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తికి ఒక సార్థకత ఉండాలి. కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్స్కే పరిమితం కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీ ప్రాంతంలోని ప్రజలకు, అవసరమైన కుటుంబాలకు మీకు చేతనైన సహాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను గర్వపడేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ నమ్మకం నాకు ఉంది” అని అభిమానులకు సూచించారు.
ధనుష్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ‘దళపతి’ విజయ్ బాటలోనే ధనుష్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చని అభిమానులు చర్చించుకుంటున్నారు. తమిళనాడుకు ధనుష్ వంటి విద్యావంతులైన నాయకుల అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతుండగా, త్వరలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు.
అదే కార్యక్రమంలో తన సినిమాలకు లభించిన జాతీయ అవార్డులపై వచ్చిన విమర్శలకూ ధనుష్ స్పందించారు. 2024లో తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ కంటే మెరుగైన తమిళ చిత్రాలు కూడా విడుదలయ్యాయని ఆయన నిజాయితీగా అంగీకరించారు.
అయితే, ఒకే ఏడాది ఒకే తమిళ నటుడికి రెండు జాతీయ అవార్డులు రావడం గర్వకారణమని, ఆ విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ధనుష్ అన్నారు. కాగా, ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి ధనుష్కు స్పెషల్ మెన్షన్ లభించగా, ‘రాయన్’ చిత్రం ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
