
D News: Jul 25: నన్ను హీరోను చేయొద్దు.. ఇది భారత రాజ్యాంగ విజయం
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఉద్యమానికి నాయకత్వం వహించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనల ఫలితంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు.
ఒక వ్యక్తిని హీరోగా చూడొద్దు
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన అభిజీత్ దీప్కే, తనను హీరోగా చూపించే ప్రయత్నం చేయవద్దని కోరారు. “ఈ విజయం నాది కాదు.. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఒక వ్యక్తిని రాజ్యాంగం కంటే, వ్యవస్థల కంటే గొప్పవాడిగా చూడడం వల్లే దేశం నష్టపోయింది. నినాదాలు చేయాలంటే ‘భారత్ మాతా కీ జై’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని చేయండి” అని అన్నారు.
“సుబహ్ హో గయీ మామూ” అంటూ వ్యంగ్యం
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి “సుబహ్ హో గయీ మామూ” అంటూ అభిజీత్ దీప్కే వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఇప్పుడు కొత్త ఉదయం మొదలైందని, దేశ ప్రజలు మేల్కొన్నారని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ఉద్యమంలో తొలి విజయం మాత్రమేనని, ఇక్కడితో పోరాటం ముగియదని స్పష్టం చేశారు. ఈ విజయాన్ని వ్యవస్థను ప్రశ్నించిన యువత, సామాన్య ప్రజల విజయంగా అభివర్ణించారు.
విద్యార్థులకు, వాలంటీర్లకు సెల్యూట్
గత 36 రోజులుగా ఎండ, వర్షం, ఇబ్బందులను లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, వాలంటీర్లకు అభిజీత్ దీప్కే అభినందనలు తెలిపారు. పోలీసులు నీరు, ఆహారం నిలిపివేసినా వెనక్కి తగ్గకుండా పోరాడిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. దేశం ఎవరి వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం కాకుండా రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందని విద్యార్థులు నిరూపించారని వ్యాఖ్యానించారు.
సీజేఐ వ్యాఖ్యలపై స్పందన
యువతను ‘కాక్రోచ్లు’గా వ్యాఖ్యానించినట్లు పేర్కొంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు అభిజీత్ దీప్కే ధన్యవాదాలు తెలిపారు. ఆ వ్యాఖ్యలే ఉద్యమానికి మరింత ఊపునిచ్చాయని, ప్రజల్లో చైతన్యం పెంచాయని ఆయన అన్నారు.
పోరాటం కొనసాగుతుందన్న సీజేపీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఉద్యమం ముగియలేదని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. రాజీనామాను వెంటనే ఆమోదించాలని, నీట్ వివాదంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపు
ఉద్యమంలో పోలీసుల లాఠీచార్జీకి గురైన విద్యార్థులను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని యువతకు విజ్ఞప్తి చేశారు.
