
D News: Jul 22: తెలంగాణ రాష్ట్రంలో యాప్ ఆధారిత రవాణా, డెలివరీ సేవలు మంగళవారం (జూలై 22) పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఓలా, ఉబెర్, ర్యాపిడో క్యాబ్, ఆటో డ్రైవర్లతో పాటు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ భాగస్వాములు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నారు. ముషీరాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో ఈ సమ్మె నిర్ణయాన్ని ప్రకటించారు.
సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సేవలు అందుబాటులో ఉండవు. అలాగే ఆహార, కిరాణా డెలివరీ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు, వినియోగదారులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కార్మిక సంఘాలు సూచించాయి.
ప్రధాన డిమాండ్లు ఇవే
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ, సమ్మె వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ఈ ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు.
గిగ్ కార్మికులకు కనీస బేస్ ఫేర్ నిర్ణయించాలని, ప్రతి కిలోమీటర్కు, ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలను అమలు చేయాలని యూనియన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. వేలాది మంది ఓలా, ఉబెర్, ర్యాపిడో డ్రైవర్లు, అలాగే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి సంస్థల డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు యూనియన్ వెల్లడించింది.
సంక్షేమ చర్యలు అమలు చేయాలని డిమాండ్
గిగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అగ్రిగేటర్ కంపెనీలపై కఠిన నియంత్రణ తీసుకురావాలని యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ రూల్స్ను వెంటనే అమలు చేయడం, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్–2025ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, అగ్రిగేటర్ సంస్థలు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని షేక్ సలావుద్దీన్ హెచ్చరించారు. ఈ ఉద్యమం కేవలం వేతనాల పెంపు కోసమే కాకుండా, గిగ్ కార్మికులకు కార్మిక హక్కులు, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో కొనసాగుతోందని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.
