
D News: Jul 22: దేవనహళ్లిలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్
కర్ణాటకలోని దేవనహళ్లి ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన నవీన్, వెంకటరమణలతో పాటు వారికి సహకరించిన రేణుక అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
పోలీసుల వివరాల ప్రకారం, జులై 17న నిందితురాలు రేణుక బాధిత బాలికను దేవనహళ్లిలోని ఓ ఆలయానికి తీసుకెళ్తానని నమ్మించి ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చింది. అనంతరం ముందస్తు పథకం ప్రకారం బాలికను నవీన్, వెంకటరమణకు అప్పగించింది. వారు బాలికను ఆటోలో మరో ప్రాంతానికి తీసుకెళ్తూ మార్గమధ్యంలో బలవంతంగా మద్యం తాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిర్మానుష్య భవనంలో అమానుషం
మద్యం మత్తులో ఉన్న బాలికను ఇంటి వద్ద దింపినట్లు నటించిన నిందితులు, “ఇప్పటికే ఆలస్యమైంది.. ఇంటికి వెళ్తే తండ్రి తిడతాడు” అని నమ్మబలికి ఆమెను ఇంట్లోకి వెళ్లనివ్వలేదు. అనంతరం సమీపంలోని నిర్మాణంలో ఉన్న నిర్మానుష్య భవనానికి తీసుకెళ్లి రాత్రంతా ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఆమెపై దాడి చేసి తీవ్రంగా హింసించినట్లు విచారణలో వెల్లడైంది.
మరుసటి రోజు ఉదయం బాలికను ఇంటి సమీపంలో వదిలేసి, జరిగిన విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించినట్లు సమాచారం. రాత్రంతా కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, మరుసటి రోజు తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన బాలికను ప్రశ్నించగా జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు.. నిందితులు అరెస్ట్
బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మూలం ఆధారంగా దేవనహళ్లి పోలీసులు గ్యాంగ్రేప్ కేసు నమోదు చేశారు. వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితులు నవీన్, వెంకటరమణతో పాటు సహకరించిన రేణుకను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితులపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
