
D News: Jul 9: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కంపెనీ ఎండీ పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి రూ.4.70 కోట్లు కాజేసిన కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఇద్దరు మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, ఏజెంట్లను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితులు దోసపాటి కృష్ణసాయి, మండవల్లి శివ నాగరాజుగా గుర్తించారు. వీరు సైబర్ మోసగాళ్లకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చి, అందుకు కమిషన్గా సుమారు రూ.4 లక్షలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. వీరి ఖాతాలకు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదైన పలు సైబర్ నేరాలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ మోసం ఎలా జరిగిందంటే.. ప్రముఖ కంపెనీ ఎండీ పేరు, ఫోటోతో నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించిన సైబర్ నేరగాళ్లు, అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సందేశాలు పంపించారు. అవి నిజంగానే తన బాస్ పంపినవేనని నమ్మిన ఉద్యోగి, వాట్సాప్లో వచ్చిన సూచనల మేరకు వివిధ బ్యాంక్ ఖాతాలకు విడతల వారీగా మొత్తం రూ.4.70 కోట్లు బదిలీ చేశాడు.
కొంతసేపటి తర్వాత అసలు ఎండీ అలాంటి సూచనలు ఇవ్వలేదని తెలిసి మోసపోయామని గుర్తించిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక విశ్లేషణ, బ్యాంక్ లావాదేవీల పరిశీలన ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
నిందితుల్లో దోసపాటి కృష్ణసాయి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందినవాడు కాగా, మండవల్లి శివ నాగరాజు హైదరాబాద్ కొత్తపేటలో నివసిస్తున్నాడు. వీరు కమిషన్ ఆశతో సైబర్ నేరగాళ్లకు కరెంట్ బ్యాంక్ ఖాతాలను సమకూరుస్తూ అక్రమ కార్యకలాపాలకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ ఘటన నేపథ్యంలో ప్రజలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచనలు చేసింది. వాట్సాప్లో తెలిసిన వారి పేరు లేదా ఫోటో కనిపించినంత మాత్రాన సందేశాలను నమ్మవద్దని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఇతరుల ఫోటోలను సులభంగా కాపీ చేసి నకిలీ ప్రొఫైళ్లు సృష్టించే అవకాశం ఉందని తెలిపింది.
ఎవరైనా అత్యవసరంగా డబ్బు కావాలని చెబుతూ కొత్త బ్యాంక్ ఖాతా వివరాలు పంపితే వెంటనే నగదు బదిలీ చేయొద్దని పోలీసులు సూచించారు. తప్పనిసరిగా ఫోన్ కాల్ లేదా ప్రత్యక్షంగా మాట్లాడి పూర్తి నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు జరపాలని సూచించారు. కేవలం వాట్సాప్ సందేశాల ఆధారంగా డబ్బులు పంపడం ప్రమాదకరమని హెచ్చరించారు.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు.
