
D Spiritual: Jul 4: అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ ఆరోపణలకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ (BKTC) వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.
బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది మాట్లాడుతూ, ఈ ఆరోపణలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల నుంచి వివరణలు కోరామని, విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఒక ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి అన్న వార్తలను హేమంత్ ద్వివేది ఖండించారు. ఆ వ్యక్తి తన వ్యక్తిగత సిబ్బందికి చెందినవాడు కాదని, బీకేటీసీలో విధులు నిర్వహిస్తున్న సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై జూలై 2న ఫిర్యాదు అందినట్లు కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సోహన్ సింగ్ రంగడ్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు చెప్పారు. ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
సీసీటీవీ దృశ్యాలు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా నివేదిక సమర్పించేందుకు అంతర్గత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.
విచారణలో ఆర్థిక అవకతవకలు లేదా కానుకల దుర్వినియోగం జరిగినట్లు తేలితే, శ్రీ బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ చట్టం–1939తో పాటు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అదే సమయంలో, విచారణ పూర్తయ్యే వరకు ధృవీకరించని సమాచారం లేదా తప్పుదోవ పట్టించే ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు కమిటీ విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారికంగా వెలువడే సమాచారం ఆధారంగానే స్పందించాలని సూచించింది.
