
D Spiritual: Apr 28: భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనను ఆధ్యాత్మికంగా, అత్యంత ఆత్మీయంగా కొనసాగించారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు కేంద్ర మంత్రితో ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముందుగా డచ్బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, డీఐజీ గోపీనాథ్ జెట్టి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్లో నేరుగా శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ స్వామి ఆలయం చేరుకుని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఉపరాష్ట్రపతి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంకు చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం లభించింది. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని వేద మంత్రోచ్ఛారణల మధ్య తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం స్వీకరించారు. అనంతరం ఇంద్ర పుష్కరణిలో జరుగుతున్న నూతన నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, నడికుదుటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు తదితరులు ఉపరాష్ట్రపతిని గౌరవపూర్వకంగా కలుసుకున్నారు.
ఆలయ దర్శనం అనంతరం ఉపరాష్ట్రపతి నేరుగా మంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన ఆత్మీయ సమావేశంలో పలువురు ప్రముఖులను పలకరించారు. ఈ సందర్భంగా దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన సతీమణి కింజరాపు విజయలక్ష్మి, సోదరుడు కింజరాపు ప్రభాకరరావు ను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, సుమారు గంటన్నర గడిపి అక్కడి నుంచి హెలిప్యాడ్కు చేరుకుని హెలికాప్టర్లో విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఉపరాష్ట్రపతి పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.
