
D Spiritual: Apr 28: పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలో ఉన్న తంతానియా కాళీబారి ఆలయం ప్రసిద్ధ శక్తి పీఠంగా పేరుగాంచింది. ఇక్కడ కొలువై ఉన్న సిద్ధేశ్వరి అమ్మవారికి ప్రత్యేక ఆచారాల ప్రకారం మాంసాహార నైవేద్యాలు కూడా సమర్పించడం ప్రత్యేకతగా ఉంటుంది. ప్రచారంలో ఉన్న నమ్మకాల ప్రకారం, రొయ్యలను నైవేద్యంగా సమర్పించడం స్థానిక సంప్రదాయాలు మరియు తాంత్రిక ఆచారాలతో సంబంధం కలిగి ఉంది. ఈ ఆలయానికి రామకృష్ణ పరమహంస తో ఆధ్యాత్మిక అనుబంధం ఉందని భక్తులు విశ్వసిస్తారు.
భారతదేశంలో కాళీ దేవికి అనేక ఆలయాలు ఉన్నప్పటికీ తంతానియా కాళీబారి ప్రత్యేకమైనది. ఇక్కడ తాంత్రిక సంప్రదాయం ప్రకారం కాళీ అమ్మవారిని “సిద్ధేశ్వరి దేవి” రూపంలో పూజిస్తారు. సాధారణ రోజుల్లో అమ్మవారికి మాంసాహార నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే కాళీ చతుర్దశి, ఫలహారిణి అమావాస్య వంటి పవిత్ర దినాల్లో మాత్రం శాకాహార నైవేద్యాలు మాత్రమే సమర్పించడం ఆనవాయితీ.
ఈ ఆలయాన్ని 1703లో తాంత్రికుడు ఉదయ నారాయణ బ్రహ్మచారి నిర్మించినట్లు చెబుతారు. ఆ కాలంలో ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేది. అప్పటినుంచే ఇక్కడ కాళీ మాత పూజలు జరుగుతాయని విశ్వాసం ఉంది. ప్రజలు ఈ ప్రాంతం దాటే సమయంలో ఆలయం నుంచి గంటల మోగే శబ్దం వినిపించేదని, ఆ శబ్దం కారణంగానే “తంతానియా” అనే పేరు స్థిరపడిందని చెబుతారు.
ఈ ఆలయంలో మాంసాహార నైవేద్యాల సంప్రదాయం కూడా విశేషమైనది. ఒక కథనం ప్రకారం, కేశవ చంద్ర సేన్ అనారోగ్యానికి గురైనప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన ఆరోగ్యం కోసం దేవిని ప్రార్థించి “దాబ్-చింగ్రి” (కొబ్బరితో చేసిన రొయ్యలు) నైవేద్యంగా సమర్పించారని చెబుతారు. ఆ సంఘటన తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందని విశ్వసిస్తారు.
మరొక కథనం ప్రకారం, రామకృష్ణ పరమహంస శ్యాంపూకుర్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆయన శిష్యులు సిద్ధేశ్వరి దేవి పాదాల వద్ద ప్రార్థించి మాంసాహార నైవేద్యాలు సమర్పించారని, అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని చెబుతారు. అప్పటి నుంచి తంతానియా కాళీబారిలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
