
D Spiritual: Apr 28: సిద్దిపేట పట్టణంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి రథోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ఆర్యవైశ్యులు ఐకమత్యంతో పాల్గొని అమ్మవారి రథాన్ని పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు.
రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన రథంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ రథయాత్రలో భక్తులు నీరాజనాలు పలికారు. భక్తిపాటలకు అనుగుణంగా ఆర్యవైశ్య సోదరీసోదరీమణులు, యువకులు నృత్యాలు చేస్తూ “జై వాసవి.. జై జై వాసవి” నినాదాలతో సిద్దిపేట వీధులు మారుమోగించారు.
ఈ రథోత్సవంలో ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ ప్రజలు మరియు భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్యవైశ్య సంఘం నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్యులు భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో ఇటువంటి గొప్ప వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య భవనం కార్యవర్గం, సభ్యులు, వార్డు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, వాసవి, వనిత, యూత్ క్లబ్బుల సభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
