
DNews:27 Apr: హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సోమవారం ఉదయం జరిగిన ఒక విషాదకర ఘటన కలకలం సృష్టించింది. మహబూబాబాద్కు చెందిన వనీశ్ అనే విద్యార్థి, యూనివర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో క్యాంపస్ ప్రాంగణంలోని లేడీస్ హాస్టల్ ఎదుట వనీశ్ అకస్మాత్తుగా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో విద్యార్థి ఆర్తనాదాలు చేయడం గమనించిన తోటి విద్యార్థులు, వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన వనీశ్ను వర్సిటీ సిబ్బంది సహాయంతో హుటాహుటిన సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
వనీశ్ శరీరంలో సుమారు 70 శాతానికి పైగా భాగాలు కాలిపోయాయని, ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితుడిని ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘోర ఆత్మహత్యాయత్నానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, ప్రాథమికంగా ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఎప్పుడూ విద్యార్థుల సందడితో కళకళలాడే క్యాంపస్లో ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
