
DNews: Mar 23: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ కుమార్తెలు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. పెద్ద కుమార్తె పరిస్థితి అత్యంత విషమంగా ఉండగా, రెండో కుమార్తెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి నర్సింజి పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (TSPA) సమీపంలో చోటుచేసుకుంది. షంషాబాద్ విమానాశ్రయం నుండి గచ్చిబౌలి వైపు వస్తున్న కారు, ముందుకు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ముగ్గురు ప్రయాణికులు ఉండగా, వారిలో మగంటి గోపీనాథ్ కుమార్తెలు ఇద్దరూ ఉన్నారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెద్ద కుమార్తెను, అలాగే స్వల్ప గాయాలతో ఉన్న రెండో కుమార్తెను వెంటనే గచ్చిబౌలి AIG ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.
నర్సింజి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కారు అధిక వేగంతో వెళ్ళడం వల్ల నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
