
D Spiritual: March 5: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రైళ్ల ద్వారా తిరుపతికి చేరుకుంటుంటారు. ఈ భారీ రద్దీ కారణంగా తిరుపతి రైల్వే స్టేషన్లలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్లుగా స్టేషన్లలో సౌకర్యాలు లేకపోవడంతో రైల్వే శాఖ స్టేషన్ను సర్వాంగ సుందరంగా మార్చేందుకు ఆధునీకరణ పనులు చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
తిరుమలకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరచూ వస్తుంటారు. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా వారు ముందుగా తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సులు, క్యాబ్ల ద్వారా తిరుమల కొండపైకి వెళ్తారు. రైళ్ల విషయానికొస్తే తిరుపతికి రైల్వే శాఖ అనేక ట్రైన్ సర్వీసులను నడుపుతోంది. దీంతో తిరుపతి వైపు వెళ్లే రైళ్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటాయి. కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా రద్దీగా ఉంటాయి.
ప్రయాణికుల తాకిడి కారణంగా తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ఎప్పుడూ జనంతో నిండిపోయి ఉంటుంది. స్టేషన్ నుంచి బయటకు రావడానికైనా, లోపలకు వెళ్లడానికైనా రద్దీ వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ తిరుపతి రైల్వే స్టేషన్ను ఆధునీకరించే పనులను ప్రారంభించింది. ఈ పనులు పూర్తయ్యాక స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 182 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ కేవలం ఆరు ఫ్లాట్ఫామ్స్, ఐదు ఫిట్లైన్లు మాత్రమే ఉన్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి ఇవి సరిపోవడం లేదు. అందుకే అదనంగా ఐదు ఫ్లాట్ఫామ్స్ను నిర్మిస్తున్నారు. దీంతో మొత్తం ఫ్లాట్ఫామ్స్ సంఖ్య 11కి పెరగనుంది. ఫ్లాట్ఫామ్స్కు సులభంగా చేరుకునేందుకు లిప్టులు, ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఇక స్టేషన్ ఉత్తర, దక్షిణ దిశల్లో రెండు భారీ భవన సముదాయాలు నిర్మిస్తున్నారు. ఈ పనుల కోసం మొత్తం రూ.321 కోట్లు ఖర్చు చేయనున్నారు. దక్షిణ దిశలో నిర్మిస్తున్న భవనం ఇప్పటికే పూర్తికి చేరువలో ఉంది. దీన్ని మార్చి నాటికి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉత్తర దిశలో నిర్మిస్తున్న భవనం డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆధునీకరణ పనులలో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సీసీటీవీ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, ఆర్వీఎఫ్ బలగాల భద్రత వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల కోసం రెండు ఎయిర్ కాన్కోర్సులు కూడా నిర్మిస్తున్నారు. వీటి పొడవు 61 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు ఉండనుంది.
అదేవిధంగా రూఫ్ ప్లాజా, టాయిలెట్లు, కుర్చీలు, విశ్రాంతి బల్లలు వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ తిరుపతికి అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అవసరానికి అనుగుణంగా కొత్త ట్రైన్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తూ భక్తులకు మరింత సౌలభ్యం కల్పిస్తోంది.
