
D Spiritual: March 5: శ్రీకాళహస్తి రూరల్లోని ఏర్పేడు మండలం గుడిమల్లం ఆలయంలో కుంభాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ నెల 7న బాలాలయం ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
గుడిమల్లం ఆలయం అత్యంత పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 30 సంవత్సరాల క్రితం శివరాత్రి సందర్భంగా ఆలయంలో అగ్నిప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించింది. ఆ ఘటన తర్వాత ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల అది జరగలేదు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఆలయానికి ధర్మకర్తల మండలిని కూడా నియమించారు.
దేశంలో తొలి శివాలయంగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరగాలి. కానీ గుడిమల్లం ఆలయానికి ధర్మకర్తల మండలి లేకపోవడంతో ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదు.
ప్రస్తుతం ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తల గిరిబాబు నాయుడు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. గుడిమల్లం అభివృద్ధికి శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కూడా కృషి చేస్తున్నారు. రూ.3 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి సంబంధించిన కట్టడాలు ధ్వంసం కాకుండా మరమ్మత్తులు చేపట్టి మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తల గిరినాయుడు, పాలకమండలి సభ్యులు రాజకుమార్ నాయుడు, ఆరుణ, నిరంజన్, ఆలయ ఈఓ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. బాలాలయం ఏర్పాటు చేసిన తర్వాత 42 రోజుల పాటు అంతరాలయంలోకి ప్రవేశం ఉండదని వారు తెలిపారు.
