
DNews: Mar 05: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ లో కేంద్ర గృహ మంత్రి అమిత్ షా ను కలుసుకుని రాష్ట్రానికి అదనపు IPS అధికారులను కేటాయించాలని అభ్యర్థించారు. ఆయన వివరించిన ప్రకారం, హైదరాబాద్ వేగంగా విస్తరిస్తుండటం, జనాభా పెరుగుదల, సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్త “ఫ్యూచర్ సిటీ కమిషనరేట్” ఏర్పాటుకు కూడా IPS అధికారుల అవసరం ఉందని వివరించారు. 2016లో జరిగిన మొదటి IPS కేడర్ సమీక్ష తర్వాత 2021లో జరగాల్సిన రెండో సమీక్ష వాయిదా పడుతూ 2025కి వెళ్లిందని, అప్పటికీ తెలంగాణకు కేవలం 7 IPS అధికారులే కేటాయించబడ్డారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది IPS అధికారులు ఉన్నారని, ఈ సంఖ్యను 105కి పెంచాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పోలీసు విభాగం బలోపేతం, మావోయిస్టుల సమస్య, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పనులకు కేంద్రం నుండి నిధుల సహాయం వంటి అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో “ఈగిల్ ఫోర్స్” కార్యకలాపాలు, సైబర్ నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నదని సీఎం వివరించారు.
మావోయిస్టుల అంశంపై విస్తృత చర్చ జరిగింది. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు పార్టీలో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు వెల్లడించిన భవిష్యత్ కార్యకలాపాల వివరాలను కూడా కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ పోలీసులను అభినందిస్తూ, “ఆపరేషన్ కాగర్”లో వారు అందించిన సహకారం ప్రశంసనీయమని, ఇది పూర్తయ్యే వరకు కొనసాగించాలని సూచించారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, ఈగిల్ టీమ్ ను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు అధికారులు, నాయకులు కూడా పాల్గొన్నారు.
