
DNews 22Jan 2026:రాంచీ/చైబాసా: ఝార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సారండా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన భీకర ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో కొందరు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
- మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ఈ దాడి జరిగింది. కిరీబురు, ఛోటానాగ్ర పోలీస్ స్టేషన్ల పరిధిలోని కుమ్డి (Kumbhdih) అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ కోబ్రా 209 బెటాలియన్, జార్ఖండ్ జగ్వార్ మరియు జిల్లా పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.
- భద్రతా బలగాలు అడవిలోకి ప్రవేశించగానే, అక్కడ మాటు వేసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. అప్రమత్తమైన జవాన్లు ధీటుగా ఎదురుదాడి చేయడంతో గంటల తరబడి కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు అక్కడికక్కడే హతమవ్వగా, మరికొందరు గాయాలతో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
- ఈ కాల్పుల్లో రూ. 50 లక్షల రివార్డు ఉన్న అగ్రనేత అనల్ దాస్తే లేదా పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా హతమై ఉండవచ్చని ప్రాథమిక వార్తలు వస్తున్నాయి. అయితే, పోలీసులు ఇంకా అధికారికంగా పేర్లను ధృవీకరించాల్సి ఉంది.ఘటనా స్థలం నుండి రెండు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మిగిలిన మావోయిస్టుల కోసం అదనపు దళాలను రప్పించి సారండా అడవిని జల్లెడ పడుతున్నారు.
