
DSports Jan05 2026: గత కొంతకాలంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహించిన సంజూ శాంసన్, ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి వెళ్లారు. అదే సమయంలో చెన్నై నుంచి రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టులోకి వచ్చారు. అనుభవం, సీనియారిటీ దృష్ట్యా రాజస్థాన్ మేనేజ్మెంట్ జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.
రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో జడేజా ఫోటోను షేర్ చేస్తూ “దళపతి” అనే క్యాప్షన్ను జోడించింది. సాధారణంగా తమిళంలో ‘దళపతి’ అంటే నాయకుడు అని అర్థం. ఈ పోస్ట్తో జడేజానే తదుపరి కెప్టెన్ అని ఫ్రాంచైజీ పరోక్షంగా స్పష్టం చేసింది.
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తో ఉన్న కొన్ని వివాదాల కారణంగా, 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తన హోం మ్యాచ్లను జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం నుండి పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి మార్చే అవకాశం ఉంది. దీనిపై బీసీసీఐ నుంచి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
రవీంద్ర జడేజా నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తన రెండో టైటిల్ను గెలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
