
D Spiritual: Dec 19: సాధారణంగా మహిళలకు ఆభరణాలు అలంకరణకు, అందానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే మహిళలు ఎన్నో రకాల బంగారు, వెండి నగలను కొనుగోలు చేసి ధరించడం మనకు సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఎంతమంది నగలు ధరించినా మహిళలు కాళ్లకు మాత్రం బంగారు పట్టీలు వేసుకోరు.
కాళ్లకు బంగారు పట్టీలు ధరించకపోవడానికి వెనుక పురాణగాధతో పాటు సంప్రదాయ విశ్వాసం ఉందని చెబుతారు. మహిళలు శరీరం అంతటా బంగారు ఆభరణాలు ధరించినా, కాళ్లకు మాత్రం వెండి పట్టీలనే ధరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
వెండి పట్టీలు ధరించడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గి, ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం. అందుకే ఆరోగ్యపరమైన కారణాలతో కూడి కాళ్లకు వెండి పట్టీలనే ధరించాలని పెద్దలు సూచిస్తారు.
పండితుల అభిప్రాయం ప్రకారం ఎంత బంగారం ఉన్నా కాళ్లకు మెట్టెలుగానీ, పట్టీలుగానీ బంగారాన్ని ధరించకూడదు. అలా ధరించడం వల్ల జీవితంలో ఆటంకాలు ఏర్పడి, పరిస్థితులు తలకిందులవుతాయని శాస్త్రపరమైన విశ్వాసం ఉంది.
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపమైన బంగారు ఆభరణాలను శరీరంపై ధరించడం శుభకరమైనదిగా భావించినప్పటికీ, కాళ్లకు ధరించడం మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లుగా భావిస్తారని పండితులు చెబుతున్నారు.
అందుకే ఎప్పుడూ కూడా కాలి వేలకు మెట్టెలుగానీ, కాళ్లకు పట్టీలుగానీ బంగారు ఆభరణాలను ధరించకూడదని సంప్రదాయం చెబుతోంది. అలా ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై సంపద నష్టం కలిగి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం ఉంది.
ఈ కారణాల వల్లే మహిళలు కాళ్లకు బంగారు పట్టీలు ధరించకుండా వెండి పట్టీలనే ధరించడం మన సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
