
DSports Dec17 2025: అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబర్ 16) జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై కనక వర్షం కురిపించాయి. ఈ వేలంలో మొత్తం 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు 10 జట్లు కలిసి ఏకంగా రూ. 215.45 కోట్లు ఖర్చు చేశాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ. 25.20 కోట్ల రికార్డు ధరతో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వశమై, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు.కామెరూన్ గ్రీన్ తర్వాత శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరనను కూడా కేకేఆర్ రూ. 18 కోట్లకు దక్కించుకుంది. అంతర్జాతీయ అనుభవం లేని భారతీయ యువ ఆటగాళ్లకు ఈ వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది. కార్తీక్ శర్మ మరియు ప్రశాంత్ వీర్ అనే ఇద్దరు ప్లేయర్లను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చెరో రూ. 14.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ను రూ. 13 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే మరికొందరు యువ బౌలర్లను తక్కువ ధరకు దక్కించుకుని తమ జట్టును పూర్తి చేసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. గత కొంతకాలంగా ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్న పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్కే తిరిగి దక్కించుకుంది.ఈ వేలంతో అన్ని జట్లు తమ తుది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.
