
DNews:10 Dec: సైబర్ నేరాలు రోజురోజుకు బెడదగా మారుతున్నాయి. ప్రజలను సులభంగా డబ్బు కొట్టేందుకు సైబర్ కేటుగాళ్లు కొత్త పన్నాగాలు పన్నుతూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ మణికొండ వేదకుమార్ వాట్సాప్ అకౌంట్ను హ్యాక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.వేదకుమార్ వాట్సాప్ కాంటాక్ట్లకు సైబర్ నేరగాళ్లు అతనే పంపినట్లుగా సందేశాలు పంపుతూ, “డబ్బులు అత్యవసరం… యూపీఏ పనిచేయడం లేదు… గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ₹60,000ను 6202756958 నంబర్కి పంపండి” అంటూ కోరారు. ఈ సందేశాలను చూసిన ఒకరు అనుమానం రావడంతో స్క్రీన్షాట్ తీసి మిగతా వారికి పంపి అప్రమత్తం చేశారు. దీంతో మిగతా వ్యక్తులు మోసపోవడం తప్పింది.
ఇటీవల ఓటీపీలు, డిజిటల్ అరెస్టులు, బ్యాంక్ ఫిషింగ్ వంటి మోసాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు అధికారులు, రాజకీయ నాయకుల వాట్సాప్ నంబర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గతంలో తెలంగాణలో పలువురు కేబినెట్ మంత్రులు ఉన్న మీడియా వాట్సాప్ గ్రూపులు కూడా హ్యాక్ అయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ప్రజలకు ఒకే సూచన చేస్తున్నారు:”అత్యవసరం, డబ్బు పంపండి” వంటి సందేశాలు వస్తే వెంటనే కాల్ ద్వారా ధృవీకరించాలి. ఏకపక్షంగా డబ్బులు పంపొద్దు.”
