
D Spiritual: Dec 9: ఇంటి విషయంలో వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా భారతీయులు, అందులోనూ హిందువులు వాస్తు శాస్త్రాన్ని అత్యంత విశ్వాసంతో పాటిస్తుంటారు. అందుకే ఇంటిని ఏ స్థలంలో నిర్మించాలి, ఏ దిశలో ఉండాలి వంటి విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఇంటి నిర్మాణం సమయంలో చాలా మందికి కలిగే ప్రధాన సందేహాల్లో దేవాలయాల సమీపంలో ఇల్లు నిర్మించడం ఒకటి. దేవాలయం దగ్గరగా ఇల్లు ఉంటే మంచిదా? చెడా? అనే ప్రశ్నలు తరచూ వస్తుంటాయి.
వాస్తు నిపుణుల ప్రకారం, మీరు నివసించే ఇంటిపై ఆలయ నీడ ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. అలా పడితే ఇంట్లో సుఖసంతోషాలు, మనశ్శాంతి దూరమవుతాయని, తరచూ వివాదాలు, సమస్యలు చుట్టుముడతాయని చెప్పబడింది. అందువల్ల ఆలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే గుడికి పూర్తిగా ఎదురుగా ఇల్లు ఉండకూడదు. ముఖ్యంగా ఆలయ మూలవిరాట్కు నేరుగా ఎదురుగా ఇల్లు ఉండటం మరింత ప్రతికూల ఫలితాలను ఇస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే శివాలయాల వెనుక వైపున ఇల్లు నిర్మించడం వాస్తుపరంగా అనుకూలమని నిపుణులు అంటున్నారు. కానీ శివాలయానికి అతి దగ్గరగా ఇల్లు ఉంటే శత్రుభయం ఎక్కువగా ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. అలాగే అమ్మవారి ఆలయాలకు సమీపంలో ఇల్లు నిర్మించరాదని చెబుతారు. ఇటువంటి ఇళ్లలో నివసించే వారు పెద్దగా వృద్ధి సాధించలేకపోవచ్చు, అనుకున్న పనులు ఆలస్యమవుతాయని అంటారు.
ఇక చివరగా, ఇంటిపై ఆలయం ధ్వజస్తంభం నీడ పడకూడదని కూడా వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు, ప్రతికూలతలు చుట్టుముడతాయని భావిస్తారు.
