
D Spiritual: Nov 26: సాధారణంగా ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడిని నాలుగు చేతులతోనే దర్శించుకుంటాము. అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఇదగుంజి గణపతి మాత్రం భక్తులకు రెండు చేతులతో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రాన్ని వినాయకుడు స్వయంగా కోరుకున్న క్షేత్రంగా పురాణాలు చెబుతాయి. ఉత్తర కర్ణాటకలోని హెన్నవర వద్ద, శరావతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. విఘ్నాలు తొలగించే దేవునిగా ప్రసిద్ధి ఉన్నప్పటికీ, ఇక్కడి ప్రజలు ఈ గణపతిని ముఖ్యంగా పెళ్లిళ్లు కాయం చేసే గణపతిగా భావించి పూజిస్తారు. ఈ దేవాలయాన్ని సుమారు 1500 సంవత్సరాల క్రితమే నిర్మించినట్టు అనుకుంటారు.
అన్ని చోట్ల ఏకదంతం, నాలుగు చేతులు, ఎలుక వాహనంతో దర్శనమిచ్చే గణపతి, ఇడగుంజిలో మాత్రం ఈ లక్షణాలు లేకుండా, భక్తుల కోరికలు తీర్చే స్వామిగా పూజలు పొందుతున్నాడు. ఇక్కడి వినాయకుడి వద్ద ఎలుక వాహనం ఉండదు, రెండు దంతాలతో ఉంటుంది. ఒక చేతిలో పద్మం, మరొక చేతిలో లడ్డుతో దర్శనమిస్తాడు. ఈ ప్రాంత ప్రజలు స్వామి అనుగ్రహం లేకుండా పెళ్లి ప్రయత్నాలు కూడా ప్రారంభించరు అనేది వారి గాఢ విశ్వాసం.
ఇక్కడ పెళ్లి సంబంధం కుదిరిన వెంటనే ఇరువైపుల పెద్దలు వచ్చి రెండు చీటీలు తీసుకువచ్చి స్వామివారి ముందు ఉంచే సంప్రదాయం ఉంది. కుడి వైపున ఉన్న చీటీ కింద పడితే అది స్వామి అనుమతిగా భావిస్తారు. అలా పడకపోతే ఆ సంబంధాన్ని కొనసాగించకుండా కొత్త సంబంధం కోసం వెతకడం ఇక్కడ సాధారణ ఆచారం.
ఇక్కడ పెళ్లిళ్లకే కాకుండా, కొంతమంది భక్తులు కేశవ కారం చేసుకునే ముందు కూడా వినాయకుడి అనుమతిని తీసుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ ఆలయంలో రోజువారీ పూజలు, నైవేద్యాలతో పాటు “పంచఖాధ్య” అనే ప్రత్యేక ప్రసాదం స్వామివారికి నివేదిస్తారు. వినాయక చవితి మాత్రమే కాదు, సంవత్సరం పొడవునా అనేక ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ క్షేత్రం ప్రత్యేకత.
విశ్వకర్మ స్వామి ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాడని, అనంతరం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు ఆలయ నిర్మాణం చేశారని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ఇడగుంజి గణపతి క్షేత్రం విశ్వాసం, సంప్రదాయం, చారిత్రక ప్రత్యేకతలతో ప్రసిద్ధి పొందింది.
