
DNews:24 Nov:నారాయణపేట, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పాలనా తీరుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారాయణపేటలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై, ప్రస్తుతం కేంద్ర నిధుల కోసం కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు.తెలంగాణ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పాలమూరు అభివృద్ధిపై ఆమె ప్రశ్నలు సంధించారు. “దమ్ముంటే పాలమూరు జిల్లాలో రోడ్లు బాగు చేయాలని” ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జిల్లా వాసికి ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా, స్థానిక ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు”కొడంగల్కు రోడ్లు వేసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్లా మారిపోయినట్లేనా?” అని నిలదీస్తూ, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రమంతా అభివృద్ధి అయినట్లు చూపడం సరికాదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన ₹3 వేల కోట్ల పంచాయతీల నిధులు ఆగిపోయాయని ఆమె వెల్లడించారు. ఆ ఆగిపోయిన నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ గురించి ఆలోచిస్తోందని ఆరోపించారు.సర్పంచుల పదవీకాలం పూర్తికాగానే కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎన్నికల రిజర్వేషన్ల విధానం గందరగోళంగా ఉందని ఎత్తిచూపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ రిజర్వేషన్లు, కానీ 2024 సర్వే ప్రకారం వార్డ్ మెంబెర్స్ రిజర్వేషన్లు నిర్వహించడం విచారకరమని పేర్కొన్నారు.పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని, పార్టీ గుర్తులపై సర్పంచులు గెలవనప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటని ఆమె నిలదీశారు.
ఎన్నికల్లో లబ్ధి పొందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలంటూ తాయిలాలు ప్రకటిస్తోందని విరుచుకుపడ్డారు. దసరాకు ఇవ్వాల్సిన చీరలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను ఆలోచించుకోవాలని కోరుతూ, “పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కావాలా..? కాంగ్రెసొళ్లు ఇచ్చే ముతక చీరలు కావాలో” ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.మొత్తంమీద, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, ఎన్నికల హామీలను విస్మరించి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తాయిలాల వైపు మొగ్గు చూపుతోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు.
