
D Spiritual: Mar 23: సోమవారం రోజున ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజు పూజలు మాత్రమే కాకుండా, మన జీవన విధానంలో కూడా కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా ఉంచడం, మనసులో అహంకారం లేకుండా ఉండడం, ఇతరులను బాధ పెట్టకపోవడం వంటి గుణాలు ఉండాలి. అన్నం తిన్న తర్వాత శుభ్రం చేయకపోవడం, ఎంగిలి చేత్తో పాత్రలను ముట్టుకోవడం వంటి అలవాట్లు దారిద్రానికి కారణమవుతాయని చెబుతారు.
ఇంటి వాతావరణం మంగళప్రదంగా ఉండాలి. ఇల్లాలు మంగళసూత్రాన్ని ధరించి, నుదుటి బొట్టు పెట్టుకుని శుభంగా కనిపించడం మంచిది. అలాగే ఇంటి ముందు ముగ్గు వేయకపోవడం, ఎక్కడపడితే అక్కడ చెత్త, దుమ్ము ఉండటం, చెప్పులు, చీపురు చెదురుమదురుగా పడేయడం, చిరిగిన లేదా మాసిపోయిన బట్టలు వాడటం వల్లా ఇవి దారిద్రానికి కారణాలుగా భావిస్తారు. అందుకే బాహ్య శుద్ధితో పాటు అంతరంగ శుద్ధి కూడా అవసరం.
అహంకారం మన జీవితంలో పెద్ద అడ్డంకి. ఇందుకు ఇంద్రుడి పురాణ కథ ఉదాహరణగా చెప్పబడుతుంది. దుర్వాస మహాముని ఇచ్చిన పూలమాలను గౌరవించకుండా విసిరేయడంతో ఇంద్రుడు తన ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. లక్ష్మీదేవి అతనిని విడిచిపెట్టింది. తరువాత వినయంతో ప్రార్థించినప్పుడు మాత్రమే ఆమె అనుగ్రహం లభించింది. కాబట్టి అహంకారాన్ని విడనాడటం అత్యంత ముఖ్యము.
చైత్ర నవరాత్రులలో వచ్చే సోమవారం రోజున శ్రీ వ్రతం లేదా నాగ దమన పూజ చేయడం చాలా శుభప్రదం. ఈ పూజలు చేయలేని వారు లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చదవవచ్చు. అవి కూడా కుదరకపోతే “శ్రీయై నమః” అంటూ అమ్మవారి చిత్రపటానికి కుంకుమార్చన చేయవచ్చు. ఈ విధంగా భక్తితో ప్రార్థిస్తే రాహు-కేతు సంబంధిత దోషాలు, వివాహం, సంతానం వంటి సమస్యలు తగ్గుతాయని నమ్మకం.
పూజలతో పాటు దానధర్మాలు చేయడం కూడా ఎంతో ముఖ్యమైనది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, దాహంతో ఉన్నవారికి నీరు అందించడం ద్వారా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వేసవిలో నీటి దానం చేయడం, పక్షులకు నీళ్లు పెట్టడం, ఆవులకు మరియు బాటసారులకు సహాయం చేయడం వంటివి అనేక దోషాలను తొలగిస్తాయని చెబుతారు.
“ఇది ఒక్కరోజు చేస్తే ఫలితం వస్తుందా?” అనే అనుమానం వద్దు. సోమవారం కనీసం పది నిమిషాలు లక్ష్మీదేవి ముందు కూర్చుని, శుద్ధమైన మనసుతో ప్రార్థించాలి. “అమ్మా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, ఈ కష్టం నుంచి బయటపడే మార్గం చూపించు” అని నిజమైన భక్తితో వేడుకుంటే, ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుంది.
